కొమ్ముతో సఫారీని ఎత్తిపడేసిన ఖడ్గమృగం.. వీడియో ఇదిగో!

  • అస్సాం మానస్‌ నేషన్‌ పార్క్‌లో ఘటన
  • కోపంతో జీపును తిరగేయడానికి రైనో యత్నం
  • భయంతో టూరిస్టులు కేకలు
  • డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
  • వీడియో నెట్టింట వైరల్
అది ఓ అడవి...
అందులో ఒక సఫారీ జీప్..
చుట్టూ పచ్చదనాన్ని, ప్రకృతి అందాలను చూస్తూ టూరిస్టులు మురిసిపోతున్నారు. 
అంతలోనే సీన్ రివర్స్ అయింది. ఎక్కడి నుంచో ఒక్కసారిగా దూసుకొచ్చిన భారీ ఖడ్గమృగం (రైనో) జీపుపై దాడికి దిగింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని టూరిస్టులు కేకలు పెట్టారు. ఊహించని ఈ భయానక ఘటన అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మానస్ నేషనల్ పార్క్‌లోని బన్స్‌బారీ పరిధిలో టూరిస్టులు జీపులో అడవిని చుట్టేస్తున్నారు. అప్పుడే ఓ భారీ ఖడ్గమృగం రోడ్డుపైకి వచ్చింది. స్థిరంగా ఉన్న ఆ జీపును చూసి దానికి ఎందుకో కోపం వచ్చింది. అంతే.. నేరుగా వచ్చి కొమ్ముతో జీపును బలంగా పొడవడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా వాహనాన్ని గాల్లోకి లేపి బోర్లా నెట్టేయడానికి ప్రయత్నించింది. రైనో ధాటికి ఆ జీపు గాల్లోకి లేచింది.

జీపులో ఉన్న టూరిస్టులు భయంతో వణికిపోతూ గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో డ్రైవర్ ఏమాత్రం కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. చాకచక్యంగా జీపును వెనక్కి తీస్తూ రైనో బారి నుంచి టూరిస్టులను కాపాడాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అడవి జంతువులు తమకు ఏదో ముప్పు పొంచి ఉందని భావించినప్పుడు లేదా తమ పిల్లల రక్షణ కోసం ఇలా ప్రవర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అడవిలోకి వెళ్లినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని సూచిస్తున్నారు.

Manas National Park
Rhino attack
Assam
Safari jeep
Wildlife
Viral video
Animal attack
Tourist safety
Indian wildlife
Rhinoceros

More Telugu News